Tuesday, July 28, 2015

GRAAMA JYOTHI SCHEME FOR VILLAGE DEVELOPMENT BY TELANGANA GOVERNMENT


గ్రామీణ ప్రాంతాల సమగ్ర, సమీకృత అభివృద్ధి కోసం ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నుంచి "గ్రామ జ్యోతి" అనే కార్యక్రమం ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. గ్రామ జ్యోతి కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే ఐదేళ్లలో రూ. 25 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు సిఎం వెల్లడించారు. జనాభాను బట్టి అన్ని గ్రామాలకు రెండు నుంచి ఆరు కోట్ల రూపాయల వరకు అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి నిధులు అందివ్వాలని ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, గ్రామ పంచాయతీలను క్రీయాశీలం చేయడం, గ్రామీణ స్థాయిలో ఎవరికి వారే తమ ప్రణాళికలు తయారు చేసుకుని అభివృద్ధి చేసుకోవడం 'గ్రామ జ్యోతి' లక్ష్యమని సిఎం కేసిఆర్ చెప్పారు.


గ్రామ జ్యోతి కార్యక్రమం విధి విధానాలను రూపొందించడానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ కే.టి.రామారావు నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని కూడా సిఎం నియమించారు. ఆర్థిక శాఖ మంత్రి శ్రీ ఈటెల రాజేందర్, ఆర్ అండ్ బి శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు, అటవీ శాఖ మంత్రి శ్రీ జోగు రామన్న సభ్యులుగా ఉంటారు. గ్రామీణాభివృద్ది కోసం చేపట్టాల్సిన కార్యక్రమం రూపకల్పనపై క్యాంపు కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. మంత్రులు కే. టి. రామారావు, టి. హరీష్ రావు, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి రేమాండ్ పీటర్, సిఎంఒ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, రంగారెడ్డి కలెక్టర్ రఘనందన్ రావు, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఇ.ఎన్.సి సురెందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఏ గ్రామానికి ఏ రకమైన పనులు కావాలో ఆయా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే ప్రణాళికలు సిద్ధం చేస్తే, వాటికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. అన్ని గ్రామాల్లో స్థానిక అవసరాలు, ఆవశ్యకతలను బట్టి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడమే గ్రామ జ్యోతి లక్ష్యమని సిఎం చెప్పారు. కేబినెట్ సబ్ కమిటీ వారం రోజుల్లోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని, ఈ నెల 30న పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే. టి. రామారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ నిరంజన్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, ప్రణాళిక శాఖ కార్యదర్శి, రూరల్ డెవలప్ మెంట్ కమిషనర్, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో తానే ఎంసిహెచ్ఆర్డిలో సమావేశం నిర్వహిస్తానని సిఎం చెప్పారు.

రాష్ట్ర స్థాయిలో ప్రణాళికలు తయారై, క్షేత్ర స్థాయిలో వాటిని అమలు చేయడం కాకుండా, ఎవరి అవసరాలకు తగినట్లు వారే ప్రణాళికలు తయారు చేసుకుని, గ్రామీణ ప్రాంతాల అభివృద్దికి వారే బాటలు వేసుకోవడం ఉత్తమమైన మార్గమని సిఎం అభిప్రాయపడ్డారు. ఇప్పటికే తెలంగాణలో "మన ఊరు - మన ప్రణాళిక" కార్యక్రమం నిర్వహించడం వల్ల 'గ్రామ జ్యోతి'కి ఒక మంచి భూమిక ఏర్పడిందన్నారు. ఫలానా గ్రామం ప్రత్యేకం అని కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ గ్రామం అవసరాలు తీర్చాలనేది ప్రభుత్వ సంకల్పమని, ఇందుకోసం దాదాపు రూ. 25 వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేసినట్లు వెల్లడించారు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత గ్రామ జ్యోతి విధి విధానాలు ఖరారు చేస్తామని సిఎం చెప్పారు.

No comments:

Post a Comment